Tuesday 16 April 2019

దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి పరిపూర్ణ వ్రత విధానం


 దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి పరిపూర్ణ  వ్రత విధానం
భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే “అనంగ త్రయోదశి”. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు. ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం. శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.
అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి
నమోస్తు పుష్పబాణాయ
జగదాహ్లాదకారిణే!!
మన్మధాయ జగన్నేత్రే !
రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి
కామదేవాయ విద్మహే|
పుష్పబాణాయ ధీమహి|
తన్నో అనంగ ప్రచోదయాత్‌||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ
మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది. అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.
మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.
మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ,ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.
రుషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.
మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.
రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతాన్ని రాగాలున్న దంపతులు, అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది

No comments:

Post a Comment